ఆళ్వార్తిరునగరి వైభవము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవర మునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో, ఆళ్వార్ తిరునగరి దివ్యదేశానికి అనేక విశేషములు ఉన్నాయి. ఈ దివ్యదేశాన్ని పూర్వకాలంలో శ్రీకురుకాపురి, ఆదిక్షేత్రం మరియు శ్రీనగరి అని కూడా వ్యవహరించే వారు. ఈ క్షేత్రములో ప్రపన్నజనకూటస్థులైన (ప్రపన్నులలో ప్రథానులు/మొదటివారు)నమ్మాళ్వార్లు అవతరించిన తరువాత ఈ దివ్యదేశాన్నిఆళ్వార్ తిరునగరి అని వ్యవహరించ సాగారు. ఇక్కడ మనము ఈ దివ్యదేశవైభవాన్ని అనుభవిద్దాము.

ఆళ్వార్ తిరునగరి అతి ప్రాచీనక్షేత్రం. శ్రియఃపతి అయిన సర్వేశ్వరుడి అనుగ్రహంతో జ్ఞానభక్తివైరాగ్యాలు అనుగ్రహప్రసాదంగా పొందినవారు, ఆళ్వార్లల్లో ప్రధానులు శ్రీనమ్మాళ్వార్లు. వీరి అవతారస్థలమే ఈ ఆళ్వార్ తిరునగరి. నమ్మాళ్వార్లు ఇక్కడి వెలసిన పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసినందున శ్రీవైష్ణవులు ఈ క్షేత్రాన్ని 108 దివ్యదేశాలలో ఒకటిగా స్తుతిస్తారు. అంతేకాదు, శ్రీరామానుజులు అవతరించడానికి సుమారు నాలుగువేల సంవత్సరాలకు మునుపే నమ్మాళ్వార్ల కృపతో, మధురకవి ఆళ్వార్ల కృషితో, తామ్రపర్ణినది నుండి శ్రీరామానుజుల దివ్యప్రతిమ(శ్రీభవిష్యదాచార్యులు) లభించినది కూడా ఈ దివ్యదేశంలోనే. అంతేకాదు, శ్రీరామానుజుల పునరావతారమైన, శ్రీరంగనాథుడికి  ఆచార్యులైన మణవాళమామునులు అవతరించినది కూడా ఈ క్షేత్రమే.

ఆ విధంగా ఆళ్వార్, ఎంబెరుమానార్, జీయర్ (మణవాళమామునులు) అవతరించిన క్షేత్రం కావుననే ఇది  “ముప్పురియూట్టియ స్థలం” (మూడు మహిమాన్వితమైన సంఘటనలు జరిగిన క్షేత్రం)గా కీర్తించబడింది.

ఎందరో మహానుభావులు అవతరించి, జీవించి, కైంకర్యం చేసి, ఇప్పటికీ కైంకర్యాలు చేస్తున్న గొప్ప శ్రీవైష్ణవ దివ్యదేశమిది. నవ తిరుపతులలో ప్రధానమైనదిగా  క్షేత్రమును కీర్తిస్తారు. ఈ దివ్యదేశం తమిళనాడులో తూత్తుక్కుడి జిల్లాలో తిరునల్వేలి- తిరుచెందూర్ మార్గములో ఉంది.

ఇన్ని మహిమలున్న ఈ దివ్యదేశం గురించి పలు విషయాలను, ఘటనలను   మనం అనుభవిద్దాం.

మూలము: https://granthams.koyil.org/azhwarthirunagari-vaibhavam-english/

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org