విరోధి పరిహారాలు – 38

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://granthams.koyil.org/2020/09/12/virodhi-pariharangal-37-telugu/

     71. సిద్ధాంత విరోధి  – సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో వచ్చే అవరోధాలు – భాగం 2

ఎమ్పెరుమానార్ (శ్రీ రామానుజ) – శ్రీపెరుంబూదూర్ – మన సిద్ధాంతాన్ని క్రమబద్ధంగా ప్రచారం చేసినవారు

సిద్ధాంత విరోధి అనే ఈ అంశాన్ని కొనసాగిద్దాము. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి చాలా వరకు అగాధమైన జ్ఞానం అవసరం. ఈ జ్ఞానాన్నిక్రమబద్ధమైన శాస్త్రాధ్యయనం ద్వారా పొందవచ్చు. సంపూర్ణ అవగాహన కలగడానికి, జ్ఞానుల మార్గదర్శకత్వంతో ఈ సూత్రాలను నేర్చుకోవడం  మంచిది.

  • సామానాధికరణ్యం (అనేక విశేషణాలు / గుణాలతో ఉన్న ఒక విశేష్యం / తత్వం ను వివరించడం), అంతర్లీన తత్వాన్ని స్వీకరించి వాటి గుణాలను నిర్లక్ష్యంచేయడం ఒక అడ్డంకి. శుక్ల పతః అంటే తెల్లని వస్త్రం. వస్త్రం అనేది ఇక్కడ పదార్ధం. తెలుపు అనేది ఆ వస్త్రం యొక్క విడదీయరాని గుణం. ఇటువంటి విడదీయరాని గుణాన్ని విశేషణం అంటారు. అనువాదకుల గమనిక: సామానాధికరణ్యాన్ని “బిన్న ప్రవృత్తి నిమిత్తానాం శబ్దానాం ఏకస్మిన్ అర్తే వృత్తిః” – ఒకే పదార్థాన్నిఅనేక పదాలతో (గుణాలు / అర్థాలు) గుర్తించడం. ఉదాహరణకు, తెల్లని వస్త్రం విషయంలో – వస్త్రం (వస్త్రంగా ఉండటం) మరియు తెలుపుదనం ఆ వస్త్రం యొక్క గుణాలు. కాబట్టి, ఒకే పదార్ధానికి సంబంధించిన అనేక అంశాలను సామానాధికరణ్యం అంటారు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మన విశిష్ఠాద్వైత సిద్దాంతంలో అతి ముఖ్యమైన సూత్రాలలో ఒకటి. బ్రహ్మం అనేది విశేష్య (పదార్ధం), ఇది ఆధారం. చిత్ అచిత్తులు విశేషణలు (గుణాలు)  ఆధేయములు (ఆధార పడి ఉన్నవి). పదార్థము మరియు గుణము రెండూ విడదీయరానివి. ఇక్కడ కొన్ని సిద్దాంతాలు చిదచిత్తులను విస్మరించి కేవలం బ్రహ్మం మీద దృష్ఠిసారిస్తాయి. కానీ అది చెల్లదు. వేదార్థ సంగ్రహంలో ఎమ్పెరుమానార్ చేత ఈ సూత్రాలు  అద్భుతంగా వివరించబడ్డాయి. ఇవి పూర్తి అవగాహన పొందడానికి సరైన ఆచార్యుల సమక్షంలో కాలక్షేపంగా విని అర్థం చేసుకోవాలి.
  • ఏక బ్రహ్మం (గుణాలతో) అని కీర్తించడం బ్రహ్మం యొక్క ఏకైక అసమానమైన స్వభావాన్ని నొక్కి చెప్తుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఏక విశేషణ విశిష్ట ఐక్యార్త పరం – ఒక గుణానికి అనుసంధానమైన ఒక తత్వం.  “స బ్రహ్మా, సశివః సేంద్రః” అని శృతి చెబుతుంది. స – “అతడు” అంటే “ఆ పరమపురుషుడిని” సూచిస్తుంది. అతడు బ్రహ్మ, అతడు శివుడు, అతడు ఇంద్రుడు. ఇక్కడ దీని అర్థం, బ్రహ్మ, శివ, ఇంద్రుడు శరీర / విశేషణ (శరీరం, లక్షణం) అని అర్థం. శ్రీమన్నారాయణుడు  అనేది శరీరి / విశేష్య (ఆత్మ) ని సూచిస్తుంది.  అనువాదకుల గమనిక: వేదంలో సాధారణంగా 3 భాగాలు గుర్తించబడ్డాయి – భేద శృతి (విభిన్న తత్వాల గురించి మాట్లాడేది), అభేద శృతి (ఏకవచన బ్రహ్మం గురించి మాట్లాడేది) మరియు గటక శృతి (బ్రహ్మం మరియు ఇతర వస్తువులను  (చిత్ / అచిత్) కలిపేది) గా గుర్తించబడ్డాయి. ఇతర సిద్దాంతాలు భేద లేదా అభేద శృతులపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, విశిష్ఠాద్వైత సిద్దాంతం గటక శ్రుతిని ఉపయోగించి భేద, అభేద శృతులను సమన్వయం చేస్తుంది. ఏకవచన బ్రహ్మానికి ప్రాధాన్యత ఉన్నచోట, చిత్ / అచిత్ బ్రహ్మల మధ్య గటక శృతి సందర్భానుసారంగా శరీర/శరీరి సంబంధం, విశేషణ / విశేష్య సంబంధం అర్థం చేసుకోవాలి. ఈ రెండు అంశాలలో, ప్రధానంగా మాయావాదం (బ్రహ్మాన్ని మాత్రమే స్వీకరించి మిగతావన్నీ భ్రమ అని స్థాపించే సూత్రాలు) తిరస్కరించబడ్డాయి. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 8.8.8 పాసురంలో  “కూడిత్తగిల్ నల్లుఱైప్పు” అని వివరించారు. అన్ని వ్యాఖ్యానాలలో ఇదే మూలసూత్రం వివరించబడింది. జీవాత్మ బ్రహ్మంతో సమానం (మరేమీ లేదు) ఎన్నడూ కాలేడు. ఎందుకంటే ఒక వస్తువు ఎప్పటికీ మరొకటిగా మారదు – జీవాత్మ జీవాత్మగానే ఉంటాడు, పరమాత్మ పరమాత్మగానే ఉంటాడు.
  • అనేకత్వ తిరస్కరణ అనేది బ్రహ్మకు భిన్నమైనదేదీ  లేదని నిర్ధారించడమౌతుందని తెలుసుకోకపోవడం ఒక అడ్డంకి. నానాత్వ నిషేదం – అనేకత్వం  యొక్క తిరస్కరణ. “ఏకమేవ అధ్విదీయం, నేహనానాస్థి కించనః” ఇది శృతి అందించిన వాక్కు. కేవలం ఒక్కటే ఉంది – రెండవది లేదు అని అర్థం. నానా – అనేకం కాదు. ఇక్కడ  అనేకత్వం  తిరస్కరించబడింది. కానీ ఈ తిరస్కరణ బ్రహ్మకు భిన్నమైన తత్వాలకు వర్తిస్తుంది. బ్రహ్మం ప్రతిదాని యొక్క అంతరాత్మ (నివాస ఆత్మ) కాబట్టి, ప్రతిదీ బ్రహ్మం (సర్వ బ్రహ్మాత్మకం) చేత విస్తరించబడి ఉంది. బ్రహ్మం చేత విస్తరించబడనిది ఏదీ లేదు.
  • సంహారం (వినాశనం) సమయంలో చిత్ అచిత్తుల సూక్ష్మ ఉనికిని సూచిస్తుంది అని తెలియక పోవడం ఒక అడ్డంకి. సంహారం అనేది విశ్వానికి సంబంధించిన కార్యాలలో మూడవ అంశం. సృష్టి, స్థితి, లయ అని మూడు అంశాలు ఉన్నాయి. సంహారం సమయంలో, చిదచిత్తులు పూర్తిగా నాశనం కావు. అవి నిత్యమైన అస్తిత్వాలు. అవి స్థూల స్థితి నుండి సూక్ష్మ స్థితికి మారి పరబ్రహ్మలోకి ప్రవేశిస్తాయి. సృష్టి సమయంలో భగవాన్ వాటికి మళ్ళీ స్థూల రూపాన్ని ఇస్తారు.  అనువాదకుల గమనిక: ఈ సూత్రాన్ని తిరువరంగత్తు అముదనార్ రామానుజ నూత్తందాది 69 వ పాసురంలో చక్కగా వివరించారు. “చింతైయినోడు కరణంగళ్ యావుం చితైన్తు మున్నాళ్ అంతముత్తాళ్ న్తతు” – సంహారం సమయంలో మనస్సు , ఇంద్రియాలు, శరీరం – అన్నీ సూక్ష్మ స్థితికి మారి మూల ప్రకృతితో కలిసి ఒక్కటవుతాయి. ఆ స్థితిలో, చిత్లు (ఆత్మలు) సూక్ష్మంగా మారతాయి, అచిత్ కూడా సూక్ష్మ స్థితి కలిగి ఉంటాయి, విడదీయలేనివిగా ఉంటాయి. కాని అప్పటికీ అవి ఉంటాయి. చిత్, అచిత్ మరియు ఈశ్వరుడు (దేవుడు) అనే మూడు తత్వములు శాశ్వతమైనవి. చిత్ (ఆత్మలు) లో స్వభావ వికారం (జ్ఞానం వికసించడం, ఇమడటం వంటి గుణ మార్పులు) ఉంటుంది. అచిత్తులో స్వరూప వికారం (స్థూల నుండి సూక్ష్మంగా మరియు వేర్వేరు స్థూల రూపాలను ధరించే స్వభావ మార్పులు) ఉంటుంది. ఈశ్వరుడు ఏ వికారం (మార్పు) లేనివాడు.
  • సోదక వాక్యములలో గుణాలను నిరాకరించడం అమంగళ గుణాలను నిరాకరించడాన్ని ఉద్దేశించినవి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. బ్రహ్మను నిర్గుణం (గుణాలు లేని) గా వివరించే కొన్ని వాక్యములు (వచనములు) ఉన్నాయి. అవి బ్రహ్మం అమంగళమైన గుణాలు లేనివాడు అని ఉద్దేశించినవి. ఇప్పటికే బ్రహ్మం “అకిల హేయ ప్రతిపత కళ్యాణ గుణైక తాన” గా స్థాపించబడి ఉన్నాడు కాబట్టి –  అమంగళ గుణాలు లేని, శుభ లక్షణాలకు మాత్రమే నివాసుడైనవాడు అని అర్థం.    అనువాదకుల గమనిక: బ్రహ్మను రెండు రకాల వాక్యాలతో వివరించారు – కారణ వాక్యములు (బ్రహ్మమే అన్నింటికీ కారణమని చెప్పే వచనములు), సోదక వాక్యములు (బ్రహ్మం యొక్క విభిన్న లక్షణాల గురించి మాట్లాడే వచనములు). “యతో వా ఇమాణి భూతాణి జాయంతే, యేణ జాతాణి జీవణ్తి, యత్ప్రయంతి అభిసంవిచంతి, తత విజిజ్ఞాసస్వ, తత్ బ్రహ్మేతి” – ఇది కారణ వాక్యానికి ఒక ఉదాహరణం. ఎవరి చేతనైతే ఈ విశ్వం, జీవులు సృష్టించబడ్డాయో, ఎవరి చేతనైతే ఈ మొత్తం విశ్వం సంరక్షించబడుతున్నదో, ప్రళయ సమయంలో సమస్థ విశ్వం ఎవరి లోనైతే విలీనం అవుతుందో,  మోక్షం సాధించిన తరువాత జీవులు ఎవరి నైతే చేరుకుంటారో, అదే బ్రహ్మం అని తెలుసుకోవాలి. ఈ విధంగా జగత్ కారణత్వ (విశ్వ కారకుడు), ముముక్షు ఉపాస్యత్వ (మోక్షం పొందాలనుకునే వారికి మూలాధార భూతునిగా ఉండటం), మోక్ష ప్రధత్వ (జీవత్మలకు మోక్షాన్ని ప్రసాదించగల సామర్థ్యం కలిగి ఉండటం) – ఇవి సర్వశక్తిమంతుడయిన వాని యొక్క  అతి ముఖ్యమైన గుణాలుగా వివరించబడ్డాయి. “సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ” – ఇది సోదక వాక్యానికి ఒక ఉదాహరణ. బ్రహ్మం జ్ఞానంతో నిండి ఉన్న, అనంతమైనదిగా (దేశానికి కాలానికి పరిమితం కాకుండా) శాశ్వతమైనదిగా వివరించబడింది. ఈ విధంగా సోదక వాక్యములను సరిగ్గా అర్థం చేసుకోవాలి.
  • బ్రహ్మం యొక్క కళ్యాణ గుణాలను ప్రదర్శించే వాక్యములను తేలికగా తీసుకోవడం ఒక అడ్డంకి. “యః సత్యకామః సత్య సంకల్పః” – అతను శుభ లక్షణాలతో నిండి ఉన్నవాడు అని వివరించినట్లుగా, వాటిని విస్మరించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: నమ్మాళ్వార్ తిరువాయ్మొళిని ఈ పాసురంతో ప్రారంభించారు, “ఉయార్వ ఱ ఉయర్ నలం ఉడైయవన్ యవన్” – శుభ లక్షణాలతో నిండిన వాడా అని అర్థం. కూరత్తాళ్వానులు తన శిష్యుడైన పిళ్ళై పిళ్ళై ఆళ్వానుకి వివరిస్తూ, నమ్మాళ్వారులు భగవానుడి కల్యాణ గుణాలను ప్రకటిస్తూ మొదలు పెట్టి తద్వారా నిరంతరం బ్రహ్మం గుణాలు లేని వాడని చెప్పే కుదృష్ఠులపై (వేదాన్ని, వేదార్థాలను తప్పుగా అర్థం చేసుకునేవారు) నేరుగా దాడిచేశారు.  
  • బ్రహ్మ స్వరూపం లేనివాడన్న దానికి అర్థం, బ్రహ్మ తమ కర్మానుసారంగా రూపాన్ని పొందడన్న విషయాన్ని సూచిస్తుంది (భగవాన్ తన కోరిక మేరకు రూపాన్ని ధరిస్తారు) ఈ విషయం తెలియకపోవడం ఒక అడ్డంకి. “నతే రూపం నచాకారః” – శరీరం, రూపం మొదలైనవి లేనివాడు, కర్మానుసారంగా పొందే ఈ లౌకిక శరీరాన్ని సూచిస్తుంది.  భగవాన్ తన కోరికమేరకు అనేకానేక రూపాలను ధరిస్తారని అర్థం చేసుకోవాలి.
  • భగవాన్‌ రూపాన్ని కీర్తించే వాక్యములను నిరాకరించడం ఒక అడ్డంకి. పరమపురుషుడు (అత్యున్నతుడు) అతి సుందర రూపం గలవాడని పూర్తి విశ్వాసం ఉండాలి. ఛాందోగ్య ఉపనిషద్లో ఒక ప్రసిద్ధ వాఖ్యము ఉంది “అంతరాధిత్యే హిరణ్మయః పురుషోదృశ్యతే – తస్యయతా కప్యాసం పుండరీకమేవమక్షిణీ” – సూర్యమండలం మధ్యలో ప్రకాశిస్తూ కనిపించేవాడా అని అర్థం. అతని రెండు నేత్రాలు సూర్యకాంతితో వికసించిన తామర పువ్వును పోలి ఉంటాయి. ఈ విషయాలు తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఋగ్వేదం ఇలా ఘోషిస్తుంది – “స ఉశ్రేయాన్ భవతి జాయమానః” – భగవాన్ ఈ భూమిపైకి దిగి వచ్చినప్పుడు మరింత ప్రశంసనీయుడవుతాడు. భగవద్గీత 4వ అధ్యాయంలో, శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార రహస్యాన్ని వెల్లడిచేశారు. 5వ శ్లోకంలో అర్జునుడికి వివరిస్తున్నారు, “నేను, నువ్వూ ఇద్దరమూ ఎన్నోసార్లు జన్మించాము. నీ ముందు జన్మల గురించి నీకు తెలియదు, కానీ నావి నాకు తెలుసు”. తరువాతి శ్లోకంలో, “నేను పుట్టుక లేని, మార్పులకు / నాశనానికి బద్దుడుకాని, అందరికీ ప్రభువు అయినప్పటికీ, నా స్వ ఇచ్ఛతో  మళ్లీ మళ్లీ జన్మిస్తాను” అని వివరిస్తున్నారు. తరువాతి శ్లోకంలో, “ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడల్లా, నేను ఆయా సమయాల్లో అవతరిస్తాను” అని ఉపదేశించారు.  తరువాతి శ్లోకంలో అతను “సజ్జనులను సంరక్షించడానికి, అధర్మాన్ని నిర్మూలించి ధర్మస్థాపనకై నేను అనేక రూపాల్లో కాలానుగుణంగా అవతరిస్తాను” అని ప్రకటించారు. చివరగా 9వ శ్లోకంలో, అర్జునుడికి ఉపదేశిస్తూ “నా దివ్య జన్మను (అవతారాలను), నా దివ్య లీలలను, నిష్ఠతో వాటిని  ధ్యానించేవాడు, తన ఈ జీవితానంతరం సంసారం (జన్మ- మరణ చక్రం) నుండి విముక్తి పొంది నన్ను చేరుకుంటాడు”. కర్మతో కట్టుబడని అనేక దివ్య రూపాలు భగవానుడికి ఉన్నాయని, వీటి నుండి మనం అర్థం చేసుకోవచ్చు.
  • ఉభయ లింగ విశిష్ఠుడు (రెండు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు ఉన్నవాడు), విలక్షణ విగ్రహ విశిష్ఠుడు (అసమానమైన రూపం ఉన్నవాడు), శ్రియః పతి (శ్రీ మహలక్ష్మి యొక్క దివ్య పతి), అకార వాచ్యుడు (“అ” – అకారంతో గుర్తింపబడేవాడు) అత్యోన్నత ప్రభువు భగవానుడని తెలియకపోవడం ఒక అడ్డంకి. అకార వాచ్యుడు – ప్రణవం (ఓం) అనేది వేదం యొక్క సారాంశం. ఇది “అ”, “ఉ”, “మ” అక్షరాల యొక్క కలయిక. ఇందులో, అకారం (అ) అత్యోన్నతుడైన శ్రీమన్నారాయణుడను సూచిస్తుంది. సర్వస్మాత్పరుడు – ఆయనకు సమానమైనవాడు గానీ లేదా అతని కంటే ఎక్కువ ఎవ్వరూ లేనివాడు. ఉభయ లింగ  విశిష్ఠుడు – 2 ప్రత్యేక వ్యక్తిత్వాలను  కలిగి ఉన్నవాడు, అవి అకిల హేయ ప్రత్యనీక (అన్ని అమంగళ గుణాలకు వ్యతిరేకమైనవాడు),  కల్యాణ గుణ పూర్ణుడు (శుభ లక్షణాలతో నిండి ఉన్నవాడు). అతను చాలా శుద్ధమైనవాడు,  ఇతరులను పరిశుద్ధి చేసే సామర్ధ్యం గలవాడు. పరత్వం (ఆధిపత్యం) మరియు సౌలాభ్యం (సరళత) రెండూ కలిగి ఉన్నవాడు. అకారం ప్రధానంగా కారణత్వం (సర్వ కారకుడు) మరియు రక్షకత్వం (సర్వ రక్షకుడు) గురించి నొక్కి చెబుతుంది.
  • శ్రీమన్నారాయణుడు జగత్కారణుడని (సర్వ కారకుడు)  తెలియకపోవడం ఒక అడ్డంకి. ఛాందోగ్య ఉపనిషత్తులో “సదేవ సోమ్య! ఇదమగ్ర ఆసీత్, ఏకమేవ, అధ్విదీయం” అని వివరించబడింది. అదే బ్రహ్మమును సుభాల ఉపనిషత్తులో “ఏకోహవై నారాయణ ఆసీత్, నబ్రహ్మా, నేశానః” అని వివరించబడింది. దీని నుండి, నారాయణుడే సర్వ కారకుడు అని స్పష్టమవుతుంది. అనువాదకుల గమనిక: మొదట, ఛాందోగ్య ఉపనిషత్తులో, ఉద్దాలకరుడు తన పుత్రునికి ఇలా వివరించారు – (సృష్ఠికి ముందు) సత్ మాత్రమే ఉండేది, మరేదీ ఉండేది కాదు. ఇక్కడ, బ్రహ్మం కాకుండా మిగతా అన్నిటిని తిరస్కరించే 3 విభిన్న అవధారణములు (సదేవ, ఏకమేవ, అద్వితీయం) అనే మూడు వేర్వేరు కారణాలు వివరించబడ్డాయి. అవి ఉపాధాన కారణం (భౌతిక కారణం), నిమిత్త కారణం (సమర్థవంతమైన కారణం), సహకారికా కారణం (సహాయక కారణం).  ఉదాహరణకు, ఒక కుండను తయారు చేయడానికి, మట్టి అనేది ఉపాదాన కారణం, కుమ్మరి (కుండను తయారు చేయాలనే అతని కోరిక) నిమిత్త కారణం, కర్ర, చక్రం మొదలైనవి సహకారిక కారణం. శృష్ఠికి, చిత్ (ఆత్మలు) మరియు అచిత్ (పదార్థం) ఉపదానం – ఇవి బ్రహ్మమునకు శరీరం వంటివి. బ్రహ్మం యొక్క సంకల్పం నిమిత్త కారణం. బ్రహ్మం యొక్క జ్ఞానం, శక్తి మొదలైనవి సహకారికం. ఇదే సూత్రాన్ని నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.8.10 పాసురంలో “వేర్ ముదలాయ్ విత్తాయ్” – వేర్ (వేరు) సహకారి, ముదల్ (పెరగాలనే కోరిక) అనేది నిమిత్తం, విత్తు (విత్తనం) ఉపాదానం అని వివరించబడింది.  ఇక్కడ భగవానుడే అన్ని 3 కారణాలుగా గుర్తించబడ్డాడు. అదే బ్రహ్మమును సుభాల ఉపనిషత్తులో నారాయణుడిగా గుర్తించబడింది. అక్కడ అప్పుడు ఆ సమయంలో నారాయణుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడని,  బ్రహ్మ, శివ మొదలైనవారు లేరని వివరించబడింది.  నారాయణుడు సమస్తానికి అత్యున్నత కారణమని వీటి నుండి మనం అర్థం చేసుకోవచ్చు.
  • ప్రాధమిక కారణాలని ప్రధానం (పదార్థం), పరమాణు (పరమాణు కణం) అని కీర్తించే సూత్రాలలో స్పష్టత కలిగి ఉండక పోవడం ఒక అడ్డంకి. ప్రధానం అనేది అచిత్ అయిన ప్రకృతి. మట్టి దానికదే కుండగా మారదు. ఒక తత్వం దానికదే స్వతంత్రంగా ప్రథమ కారణం కాలేదు. పరమాణు (పరమాణు కణం) కారణం కణాద చేత సమర్పించబడుతుంది. ఇది కూడా స్వీగీకరించలేము. సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అన్ని విశ్వాలలో అంతర్యామిగా సర్వవ్యాప్తి చెంది ఉన్నావాడు అన్నది మాత్రమే కారణం, “వేర్ ముదలాయ్ విత్తాయ్” లో చూసినట్లు దీనిపై ఎటువంటి సందేహం ఉండకూడదు. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు, తత్వ త్రయ సూత్రము 153 నుండి 156 వరకు ప్రధానం మరియు పరమాణు కారణం అనే భావనను తిరస్కరించారు. మాముణుల ఈ సూత్రాలకు అందమైన వివరణ ఇచ్చారు. పరమాణు (అణు కణము) కారణమని బౌద్ధ, జైన మరియు వైశేషికుల చేత ప్రచారంలోకి వచ్చింది. ప్రధానం (ప్రకృతి – అచిత్ – తత్వం) కారణమని కపిల మహర్షి చేత ప్రచారంలోకి వచ్చింది. ఈ సూత్రాలు శ్రుతికి విరుద్ధమైనవి, తర్కానికి మించినవి కాబట్టి వాటిని స్వీకరించలేము.
  • బ్రహ్మ, శివ (నారాయణ చేత సృష్టించబడిన) మొదలైనవారిని పరత్వం (ఆధిపత్యం), కారణత్వం (సర్వ కారకుడు) అని భావించడం  ఒక అడ్డంకి. తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాది 1వ పాసురంలో, “నాన్ముగనై నారాయణన్ పడైత్తాన్, నాన్ముగనుం తాన్ముగమాయ్ శంకరనైత్తాన్ పడైత్తాన్” – నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మ శంకరుని సృష్టించాడు. బ్రహ్మ, రుద్ర మొదలైన దేవతలు  శ్రీమన్నారాయణుడి చేత సృష్టించబడ్డారు. ఆధిపత్యానికి అవకాశమే లేదు, వారు కారణమనే ప్రశ్నే తలెత్తదు.
  • బ్రహ్మ, విష్ణు, రుద్రాలను సమానంగా పరిగణించడం ఒక అడ్డంకి. బ్రహ్మ, విష్ణు, శివుడిని త్రిమూర్తులని కీర్తిస్తారు. ముదల్ తిరువంతాది 15వ పాసురంలో పోయిగై ఆళ్వారులు ఈ విధంగా వివరించారు, “ముదలావార్ మూవరే – అమ్మువారుళ్ళుం ముదలావాన్ మూరి నీర్ వణ్ణన్” – ఇతర దేవతల మినహా ప్రాధాన్యతగల ముగ్గురు దేవతలున్నారు. వారిలో,  సముద్రపు నీటి వంటి నీలం రంగును పోలిన శరీర రంగు గలవాడు అత్యున్నతుడు. ఈ పాసురంలో వివరించినట్లుగా, బ్రహ్మ (సృష్టి బాధ్యత వహిస్తాడు), విష్ణు (సంరక్షణ బాధ్యత వహిస్తాడు), శివుడు (వినాశన బాధ్యత వహిస్తాడు). వీరు ముగ్గురిలో విష్ణు మూలభూత దేవుడు. వీరు ముగ్గురు ఒకే స్థాయికి చెందిన వారు కాదు.  అనువాదకుల గమనిక: నంపిళ్ళై ఈ పాసుర వ్యాఖ్యానంలో ఈ ముగ్గురిపైన దృష్టి పెట్టడానికి గల కారణాన్ని చెబుతున్నారు. ఆళ్వార్ ఈ ముగ్గురు దేవుళ్ళ గురించి మాట్లాడుతూ (ముక్కోటి దేవతల గురించి చెప్పడానికి బదులుగా), వీళ్ళలో ఇద్దరిని తిరస్కరించడంతో విష్ణువు అత్యున్నతుడని నిరూపించడం సులభం. పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో వివిధ రకాల అపచారాల గురించి వివరించారు. భగవత్ అపచారము గురించి వివరించేటప్పుడు, సూత్రం 303 లో,  దేవతాంతరములను శ్రీమన్నారాయణుడితో సమానంగా పరిగణించడం మొదటి నేరం అని వివరిస్తున్నారు. నమ్మాళ్వార్ తిరువాయ్మొళి 2.3.2 లో కూడా “ఒత్తార్ మిక్కారై ఇలైయాయ మా మాయా” – అతనికి సమానమైన లేదా ఉన్నతమైన వారెవరు లేని గొప్పవాడు. ఇది స్వేతస్తర ఉపనిషత్ వాక్యం “న తత్ సమశ్చ అభ్యధికశ్చ దృశ్యతే” అని వివరిస్తుంది.
  • సర్వ రక్షకుడు (అందరికీ రక్షకుడు/విమోచకుడు – శ్రీమన్నారాయణుడు) కాకుండా ఇతర మరెవరినైనా రక్షణగా (రక్షకుడు / విమోచకుడు) భావించడం ఒక అడ్డంకి. అకార వాచ్యమైయిన  (“అ” యొక్క అర్ధం) శ్రీమన్నారాయణుడే అందరికీ రక్షకుడు. అన్ని వరాలనివ్వ గలవాడు. దేవతాంతరములకు ఈ సామధ్యం లేదు. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు ప్రపన్న పరిత్రాణం అనే ఒక రహస్య గ్రంథాన్ని రాశారు. శ్రీమన్నారాయణుడు మాత్రమే రక్షకుడని, మమ్మల్ని రక్షించి / విముక్తులను చేయగలిగిన వారెవరూ లేరని ఈ గ్రంథంలో వారు వివరించారు. ముముక్షుప్పడి 36 వ సూత్రంలో, పిళ్ళై లోకాచార్యులు రక్షకం అనే పదం యొక్క అర్ధాన్ని వివరించారు. రక్షకం అంటే అడ్డంకులను తొలగించి కోరికలను తీర్చడం అని వివరిస్తున్నారు. జీవాత్మల బట్టి అడ్డంకులు మరియు కోరికలు మారుతాయని వారు అ తరువాతి సూత్రాలలో వివరిస్తున్నారు. ఒక సంసారీకి (భౌతికవాది), శత్రువులు, వ్యాధులు మొదలైనవి అడ్డంకులు. మంచి భోజనం, లౌకిక సుఖాలు మొదలైనవి వారి కోరికలు. ముముక్షువుకి (మోక్షాన్ని కోరేవాడికి), ఈ సంసారంలో ఉండడమే ఒక అడ్డంకి. పరమపదం చేరుకొని భగవానుడికి నిత్య కైంకర్యం చేయాలనేదే వారి కోరిక. ముక్తులకు (ముక్తి పొందినవారు), నిత్యులకు (నిత్య సూరులు) కైంకర్యంలో అంతరాయం ఒక అడ్డంకి మరియు కైంకర్యంలో వృద్ధిపొందాలనేదే వారి కోరిక. వారు ప్రపన్న పరిత్రాణం సుత్రం 39 లో, “శ్రీమన్నారాయణుడు తప్ప మరొక మోక్షప్రదాత లేడు” అని వివరిస్తున్నారు. అందువల్ల ఏ అడ్డంకులు వచ్చినా, వాటిని తొలగించేది భగవాన్ మాత్రమే. కోరికలు ఏమైనప్పటికీ, భగవాన్ మాత్రమే వాటిని తీర్చగలడు. అధములు తమ కోరికలను తీర్చమని దేవతాంతరములను వేడుకున్నప్పుడు కూడా, అంతర్యామిగా ఉన్న భగవాన్, ఆయా దేవతల ద్వారా ఆ కోరికలను తీరుస్తాడు.
  • శ్రీమన్నారాయణుడు కాకుండా మరొకరిని ప్రభువుగా భావించడం ఒక అడ్డంకి. శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్య పతి అయిన శ్రీమన్నారాయణుడే, పరమపదం (నిత్య విభూతి – శ్రీ వైకుంఠం) మరియు సంసారం (లీలా విభూతి – భౌతిక ప్రపంచం) రెండింటికి ఏకైక యజమాని. శేషి అనగా యజమాని, స్వామి, ప్రభువు. ఇతర మరెవరినీ ఈశ్వరునిగా (నియంత్రించువాడు) పరిగణించడం అపరాధం. అనువాదకుల గమనిక: మనం ఈ విషయాన్ని తిరుమళిసై ఆళ్వార్ మాటల ద్వారా  నాన్ముగన్ తిరువంతాది పాసురం 53లో ఇప్పటికే చూశాము, “తిరువిల్లాత్ తెవరై తేరేన్మిన్ దేవు” –  శ్రీ మహలక్ష్మితో సంబంధం లేని ఈ ఇతర దేవతలను నేను ఎన్నడూ దేవతలుగా పరిగణించను. ముముక్షుప్పడిలో, భగవాన్ ఇతరులను రక్షించేటప్పుడు, విముక్తులను చేసేటప్పుడు ఎప్పుడూ శ్రీ మహలక్ష్మితో ఉంటారని భగవాన్ రక్షకత్వం యొక్క విభాగంలో పిళ్ళై లోకాచార్యులు వివరిస్తున్నారు.
  • శ్రీమన్నారాయణుడు కాకుండా మనం ఆరాదించాల్సిన పరబ్రహ్మ మరింకెవరో ఉన్నారని భావించడం ఒక అడ్డంకి. ముముక్షు అనగా మోక్షాన్ని (ముక్తి – పరమపదంలో నిత్య కైంకర్యం) కోరుకునేవాడు. శ్రీమన్నారాయణుడు  మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలడు. మరెవరూ ఇవ్వలేరు. కాబట్టి, అటువంటి ముముక్షువు శ్రీమన్నారాయణుడను మాత్రమే నమ్మకంగా ధ్యానించాలి. అనువాదకుల గమనిక: ఛాందోజ్ఞ ఉపనిషద్ ఇలా అంటుంది “కారణం తు ద్యేయః” – ధ్యానించవలసిన అత్యోన్నత కారణం. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఈ సూత్రం మన ధ్యాన వస్తువును స్థాపిస్తుంది – కాని ఇది అత్యోన్నత కారణం ఏమిటని నిర్వచించ లేదు. అత్యోన్నత కారణం శ్రీమన్నారాయణుడు మాత్రమే అని మనం ఇప్పటికే చూశాము. ఈ రెండింటినీ అనుసంధానించడం ద్వారా, సిద్ధాంతం స్థాపించబడింది – అనగా, మనం అత్యున్నత  కారణంపై దృష్ఠి పెట్టాలి, ఆ అత్యున్నత కారణం శ్రీమన్నారాయణుడు. కాబట్టి, నిరంతరం మనం శ్రీమన్నారాయణుడి చింతన చేయాలి. శ్రీమన్నారాయణుడను “ముకుంద” అని పిలుస్తారు, అంటే ముక్తిని ప్రసాదించేవాడు అని కూడా మనం గమనించాలి.
  • పురుషోత్తముడు (మోక్ష ప్రదాత) కాక, మన కోరికలను తీర్చగలవాడు ఇంకొకరెవరూ లేరని తెలియకపోవడం ఒక అడ్డంకి. సర్వ అభిమత ఫల ప్రదాత – అన్ని రకాల కోరికలను తీర్చగలవాడు. దేవతాంతరములు భౌతిక వరాలు మాత్రమే ఇవ్వగలవు. కానీ పరమ పురుషుడు కేశవుడు అన్ని కోరికలను తీర్చడంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించగలడు.
  • క్షుద్ర దేవతలను ఆరాధించడం ఒక అడ్డంకి. క్షుద్రం – చిన్న/ నిమ్న అని అర్థం. అనువాదకుల గమనిక: గతంలో సూచించినట్లుగా, దేవతాంతరములు భౌతిక వరాలు మాత్రమే ఇవ్వగలదు. కానీ ఒక ప్రపన్నునికి, భౌతిక కోరికల నుండి విముక్తి పొంది, శ్రీమన్నారాయణుని నిత్య కైంకర్యంలో స్థిరపడటమే వారి లక్ష్యం. భగవద్గీత, 7 వ అధ్యాయంలో, భగవాన్ అన్య దేవతల యొక్క స్వభావ పరిమితులు మరియు వారు ఇచ్చిన వరాలను వివరిస్తున్నారు. దేవతాంతరముల ఆరాధన చేయడం, ఈ సంసారంలో మన జన్మ / మరణ చక్రాన్ని పునరావృతం చేస్తుంది. అందుకని వారి ఆరాధనను స్పష్టంగా తిరస్కరించారు.
  • తాత్కాలికమైన / అల్పమైన అంశాల పై కోరికలు కలిగి ఉండటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  మునుపటి వివరణ మాదిరిగానే. ఒక ప్రప్పన్నుడు కావడంతో, తాత్కాలిక మరియు అల్పమైన అంశాల పట్ల ఆసక్తిని పెంచుకోకూడదు. పరమపదంలో భగవానుడి నిత్య కైంకర్యంపై దృష్టి పెట్టాలి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో – https://granthams.koyil.org/2014/09/virodhi-pariharangal-38/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment