సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అర్థపంచకం – ఐదు ముఖ్యమైన అంశములు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<< తత్త్వత్రయం – త్రివిధ తత్త్వములు

భగవానుడు 6 రూపములలో (తన ఉనికిని) వేంచేసి ఉంటాడు – పరత్వం (పరమపదమున), వ్యూ హ(క్షీర సముద్రమున), విభవ (రామ కృష్ణాది అవతారములు), అంతర్యామి (యోగుల హృదయములలో నివసించు), అర్చావతారం (దేవాలయాలు, మఠం, గృహములలో ఉన్న విగ్రహరూపం) మరియు ఆచార్యుని రూపమున.

మిక్క ఇఱైనిలైయుం మెయ్యాం ఉయిర్ నిలైయుం
తక్క నెఱియుం తడైయాగిత్తొక్కియలుం
ఊళ్ వినైయుం వాళ్ వినైయుం  ఓదుం
కురుగైయర్ కోన్ యాళిన్ ఇశై వేదత్తియల్ 

– తిరువాయ్మొళికి  పరాశరభట్టర్ అనుగ్రహించిన తనియన్

ఆళ్వార్ తిరునగరి నివాసి మరియు అధికారియైన నమ్మాళ్వార్ అనుగ్రహించిన  తిరువాయ్మొళి అను వీణానాదం అతి ముఖ్యమైన ఐదు అంశములను చాలా శ్రావ్యంగా పలుకుతుందట. ‌అవి – పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని (పర స్వరూపం) – జీవాత్మ స్వభావం (జీవాత్మ స్వరూపం) – ఉపాయ స్వరూపం (జీవాత్మ పొందవలసినది) – విరోధి స్వరూపం (పరమాత్మను పొందుటకు అడ్డంకులు) – ఉపేయ స్వరూపం (పరమాత్మను పొందుటకు పరికరం).

అర్థ పంచకం అనగా “ఐదు అంశములు” (అత్యంతావశ్యకంగా తెలుకోవలసినవి). పిళ్ళై లోకాచార్యులు తమ రహస్య గ్రంథములలో ఈ ఐదు అంశములను “అర్థపంచకం” అను పేరుతో  కృప చేశారు. ఈ గ్రంథమంతా ఈ ఐదు అంశముల సంకలమే.

ఈ గ్రంథములోని ఈ విషయాలను పరిశీలిద్దాం:

  • జీవాత్మ ఇది తిరిగి 5 ఉపవిభాగాలుగా విభజించబడింది.

1) నిత్యసూరులు: పరమపదమున అనాదిగా నివసిస్తున్నవారు. (శ్రీ వైకుంఠం – నిత్యం భగవదానందానుభవం చేయు స్థలం)

2) ముక్త్మాత్ములు: ఆత్మ విమోచనం పొంది పరమపదమును చేరు కున్నవారు (అంటే ఒకానొక జన్మలో సంసార బంధ వాసన కలిగి ఉన్నవారు).

3) బద్ధాత్ములు: సంసార బంధముననే అతి అభిలాష కలవారు.

4) కైవల్యులు: మోక్షమును పొందిన ఆత్మలు (సంసారం నుండి విముక్తి పొందిన వారు). కాని ఆత్మాను భవమును కోరుకొనేవారు (అనగా భగవత్ కైంకర్యమునకు అతి దూరులు) భగవదనుభవమున ఆశ లేనివారు.

5) ముముక్షువులు: సంసారంలో ఉండి విముక్తినిపొంది భగవానునికి నిత్య కైంకర్యము చేయాలనుకొనేవారు.

1) పరత్వం: పరమపదమున వేంచేసి ఉండు దివ్యమైన రూపం.

2) వ్యూహం: క్షీరాబ్ధిలో ఉండు అనంతశయనుని రూపాలు. ఇవి సంకర్షణ (సృష్ఠి), ప్రద్యుమ్న (స్థితి), అనిరుద్ధ (లయ) రూపాలు.

3) విభవ: శ్రీ రామ, శ్రీ కృష్ణ వంటి అవతారములు.

4) అంతర్యామి: ఆత్మ లోపల నివాసముండువాడు. ఇతను రెండు రూపములచే వేంచేసి ఉంటాడు – ఒకటి ఆత్మలోనుండు రూపం, మరొకటి హృదయంలో శ్రీ మహాలక్ష్మితో కూడుకొని ఉన్న ప్రకాశించు రూపం.

5) అర్చావతారం: ఆరాధనకు వీలుగా కంటికి కనిపించు రూపం. దేవాలయములు, మఠములు, గృహములలో వేంచేసి ఉన్న రూపం.

  • పురుషార్థం: పురుషుని (జీవుని) చేత సాధించ దగినది. ఇది ఐదు విభాగములు

1) ధర్మం:  లోక కళ్యాణార్థం చేయు కార్యములు.

2) అర్థ: శాస్త్రానుసారం సంపదను ఆర్జించుట.

3) కామ: ప్రాపంచిక సుఖములు.

4) ఆత్మానుభవం: స్వీయానుభవం

5) భగవత్ కైంకర్యం (పరమ పురుషార్థం): పరమపదమున భగవానునికి సర్వ విధ సేవలు చేయడం. భౌతిక శరీరమును వదలి పరమపదమునకు చేరి, దివ్య శరీరమును పొంది, నిత్య సూరులకు ముక్త్మాత్మలకు అర్పింప బడుట.

  • ఉపాయం: ఇది ఐదు విభాగములు

1) కర్మ యోగం: శాస్త్ర విహితమైన యఙ్ఞం, దానం, తపం మరియు ధ్యానం మొదలైన వాటిని ఆచరించుటచే ఇంద్రియ నిగ్రహం పొంది దీని ద్వారా అష్ఠాంగ యోగాదులను అనుష్ఠించి ఆత్మ తత్త్వం తెలుసుకొనుట. ఇది ఙ్ఞాన యోగమునకు సహకారిగా ఉండును. ఐహికమైన సంపదలపై నియంత్రణను చేయును.

2) ఙ్ఞాన యోగం: కర్మ యోగము ద్వారా ఆర్జించిన ఙ్ఞానముతో హృదయాంతర్గతుడై మనపైననే తదేక దృష్ఠి సారించిన భగవానుడైన శ్రీమన్నారాయణున్ని ధ్యానం చేయుట. ఇది భక్తి యోగమునకు దోహద పడి కైవల్య మోక్షమును అందించును.

3) భక్తి యోగం: ఙ్ఞాన యోగ సహకారంతో స్థిరమైన ధ్యానము ఏర్పడుతుంది, ఇది పరమానందమునకు దారి తీసి పేరుకుపోయిన పాపాలను మరియు దుర్గుణములను తొలగించి వేసి చేరుకోవలసిన లక్ష్యమువైపు పయణం సాగేలా చేస్తుంది.

4) ప్రపత్తి: భగవానున్ని శరణు జొచ్చుట / ఆధీనమవుట. అత్యంత సులభమైనది మరియు ఆనందాను భవమును కలిగించునది. శీఘ్రముగా ఫలితములనిచ్చునది. ఒకసారి శరణాగతి చేశామా చాలు ఇక ఇతర వ్యాపారములన్నీ దీనికి అనుగుణంగా భగవత్ సేవలో భాగంగా మారి పోతాయి.

ఇది కర్మ, ఙ్ఞాన, భక్తి యోగములు అనుసరించలేని వారికి మరియు ఇవి అనుచితంగా లేని వారికి  అత్యంత సులభమైన మార్గం. (తాను భగవానునికి మాత్రమే చెందిన వాడిని అనే స్వరూప ఙ్ఞానం కలిగినప్పుడు స్వీయ రక్షణ, స్వప్రయత్నములు సరైనవి కావని తెలుసుకొంటాడు) దీనిలో రెండు విభాగములు – ఆర్త ప్రపత్తి – (ఈ భౌతిక జగత్తులో క్షణ కాలం కూడ ఉండడం సహించలేక పరమపదం చేరాలని త్వర ఉన్నవారు) మరియు ద్రుపద ప్రపత్తి (పరమపదమునకు చేరుకొనే వరకు ఈ భౌతిక జగత్తులో ఉంటు సర్వం భగవానునిపై భారము నుంచి  భగవత్భాగవత ఆచార్య కైంకర్యమును చేస్తుండే వారు).

5) ఆచార్య అభిమానం:  పైన చెప్పబడిన మార్గములన్నీ అనుష్ఠించడం క్లిష్ఠతరమైనప్పుడు ఆచార్యుడే (భగవదాఙ్ఞతో) పరమ కృపతో, ప్రేమతో అతనిని స్వీకరించి అతని రక్షణ భారాన్ని తాను స్వీకరించి ఙ్ఞానము నందించి మార్గదర్శం చూపుట. శిష్యుడు తన సర్వస్వం ఆచార్యుడే అని భావించి అతనిని వినమ్రతో సదా అనుకరించాలి.

విశేషసూచన: ఇక్కడ మనం ఉత్తారక ఆచార్యులైన (ఈ సంసారం నుండి ఉజ్జీవింప చేశేవారు) భగవద్రామానుజులను స్మరించాలి. అలాగే మనకు ఈ ఉత్తారకాచార్యులను చూపిన వారిని (స్వాచార్యులను) ఉపకారకాచార్యులుగా భావించాలి. మన పూర్వాచార్యులందరు దీనిని అనుష్ఠానమున ఉంచి భగద్రామానుజుల శ్రీ పాదములనే శరణు వేడారు.

విశేషంగా తెలుసుకోవాలన్న దీనిని పరిశీలించవచ్చుhttps://granthams.koyil.org/charamopaya-nirnayam-english/ .

మణవాళ మాముణులు తమ ఆర్తి ప్రబంధమున  భగవద్రామానుజులకు పూర్తిగా వశుడై కైంకర్యం చేసిన వడుగ నంబి వలె తాము కూడ ఉండాలని ఆర్తి చెందారు.

  • విరోధి – ఈ అంశం మనను మన లక్ష్యమును చేరుకోకుండ అడ్డగించును. ఇది ఐదు విభాగములు

1) స్వరూప విరోధి: శరీరమునే ఆత్మగా భ్రమింప చేయును. భగవతేతర అంశములపై ప్రీతిని కలిగించి స్వతంత్రునిగా భ్రమింపచేయును.

2) పరత్వ విరోధి: ఇతర దేవతలను పరత్వముగా భావింప చేయును. దేవతాంతరములను భగవంతునితో సమానమనే భ్రమను కలిగించును. అల్ప దేవతలు సర్వ శక్తిమంతులని, భగవానుని అవతారములను సామాన్య మానవునిగా, భగవానుని అర్చా మూర్తిని కేవలం బొమ్మ అని భావింప చేస్తుంది.

3) పురుషార్థ విరోధి: భగవానుని కైంకర్యము కన్న ఇతరములపై వ్యామోహమును కలిగించును. భగవానుని సేవలో వ్యక్తిగత తత్త్వమునకు ప్రాధాన్యతను కలిగించును. (భగవానుని నియమమునకు వ్యతిరిక్తముగా)

4) ఉపాయ విరోధి: ఇతరోపాయములకు అధిక ప్రాధాన్యత నిచ్చుట. ఫలా పేక్షతో ఆశ్రయించడం. పరమపద  కైంకర్యముకన్న వీటిని అధికంగా భావించడం. (సర్వార్థ ఫలమునను అగ్రహించు ఆచార్య /  భగవానుని కంటే వీటిని అధికంగా నమ్ముట). అన్ని సమస్యలకు భీతి చెందుట. (ఆచార్య / భగవానునిపై నమ్మకలేని)

5) ప్రాప్తి విరోధి: పొందవలసిన దానిని పొందనీయకుండచేయును. ప్రస్తుత శరీరముతో దుశ్చర్యలను, భగవతాపచార, భాగవతాపచారములను చేయించును.

స్వామి పిళ్ళై లోకాచార్యులు అర్థ పంచకమును ఇలా వివరించి (సారం) ముగిస్తున్నారు.

ఈ అర్థ పంచక ఙ్ఞానమును పొందిన తర్వాత ముముక్షువు (మోక్షము నందు ఇచ్ఛ కలిగినవాడు) వర్ణాశ్రమ ధర్మాలకను గుణంగా ఆర్జిస్తు, వైష్ణవ నియమాలను పాటిస్తు, ఆర్జించిన దానిని తన శరీర పోషణ సరిపడే మాత్రమే స్వీకరించి మిగిలినది భగవానునికి  / భాగవతులకు సమర్పించి, ఆచార్యుని కృపతో ఙ్ఞానోదయం పొంది అతనికి సేవ చేస్తు జీవించాలి.

 భగవానుని ముందు వినమ్రతతో (భగవానుడే సర్వ శ్రేష్ఠుడని భావిస్తు), ఆచార్యుని ముందు అఙ్ఞానిలా (ఆచార్యుడే ఙ్ఞానాధికుడని భావిస్తు) శ్రీ వైష్ణవుల యందు ఆదరణ భావనతో (వారి వైభవమును తెలుసు కనుక), సంసారుల యందు హేయ భావమును ప్రదర్శిస్తు (భౌతిక సంసారులను దూరపరచుటకు) ఉండవలెను.

లక్ష్య సాధనకై త్వర / తృష్ణ కలిగి ఉండాలి, ఈ విధానముపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండాలి, అడ్డంకులను (విరోధములను) అధిగమించాలి, శరీరంపై వ్యామోహమును వదలాలి, ఆత్మ పరిపూర్ణత కలిగి ఉండాలి, తనకు తాను రక్షకుడనే విషయంలో అశక్తుడవ్వాలి, భగవానుని యందు కృతఙ్ఞతా భావం కలిగి ఉండాలి, ఆచార్యుని యందు కృతఙ్ఞతా మరియు విశ్వాసమును కలిగి ఉండాలి.

ఎవరైతే ఆచార్యుల ద్వార ఙ్ఞానము పొంది ఆ ఙ్ఞానమును అనుష్ఠానమున పెడతారో వారు భగవానునికి తన దేవేరల కన్నా, నిత్యసూరుల కన్నా మరియు ముక్తాత్మల కన్నా అధికంగా  ప్రీతి పాత్రుడవతారు.

ఆళ్వార్ తిరువడిగళే శరణం
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
పిళ్ళైలోచార్యర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం                                                               

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలం:  https://granthams.koyil.org/2015/12/artha-panchakam/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – https://pillai.koyil.org

Leave a Comment