విరోధి పరిహారాలు – 1

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవులు తమ రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానార్ వంగి పురత్తు నంబికి వివరించారు. వంగి పురత్తు నంబి ఈ ఉపదేశాలను వాటి వ్యాఖ్యానమును ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పరిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు ఈ పుస్తకము నందు పొందుపరపబడినవి – https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

1. స్వర్గత్తుక్కు సంసారం విరోధి  – సంసారం (ఈ శరీరానికి సంభందించినది) స్వర్గపు సుఖాలకు విరోధి.

సాధారణంగా స్వర్గం అంటే దేవతల గ్రహాలని అర్థం. ఇంద్రుడి నివాసం స్వర్గమని అంటారు. ఈ భూమిపైన కానరాని అనేక సుఖాలతో నిండి ఉంటుంది ఆ స్వర్గలోకం. కానీ స్వర్గలోకాన్ని చేరుకోడానికి అనేక తపస్సులు చేయవలసి ఉంటుంది.  ఈ భూలోకంలో (సంసారంలో) జన్మ, జీవితం వారి వారి కర్మ ఫలితంగా లభిస్తుంది. ఈ సంసార జీవితం తపస్సుకు అడ్డంకులుగా భావిస్తారు. తమ దేహం, బంధువులు (భార్య, పిల్లలు), ఆస్తులు (భూమి, సంపదలు)  తపోనిష్ఠకి అడ్డంకులు అవుతాయి. కావున వాటిని పరిత్యజించాలి.

 భూలోక సుఖాలు – స్వర్గానికి అడ్డంకులు

అనువాదకుని గమనిక: “జ్యోతిష్థోమేన స్వర్గ కామో యజేత”  స్వర్గాన్ని కోరుకునే వారు జ్యోతిష్థోమం చేయవలిన అవసరం ఉంది – ఈ హోమానికి అతికఠినమైన నిష్ఠ అవసరం.

2.  స్వర్గేచ్చువుక్కు ఐహిక సుఖం విరోధి – పరలోక సుఖాలను కోరేవారికి ఈ భూలోక సుఖాలు విరోధి.

మునుపటి సూత్రానికి పోలియున్నది. పరలోక సుఖాలను ఆస్వాదించే కోరిక ఉన్నవారికి, ఈ  భూలోక సుఖాలు అడ్డంకులు అవుతాయి. ఈ భూలోక సుఖాలపై ఆసక్తి ఉన్నట్లయితే, అది పరలోకాలను కోరేవారి నిష్ఠను భంగపరుస్తుంది.

అనువాదకుని గమనిక: ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది –  స్వర్గానుభవం గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించబడింది అని? ఇది ప్రపన్నులకు ఎలా సంబంధించినది అని? ఇది కేవలం ఒక అభ్యుదయ మార్గంలో,  చిన్న కోరికల నుండి ఉన్నతమైన భాగవత సేవా ప్రాప్తి వరకు, ఉన్న వివిధ అడ్డంకుల గురించి వివరించుటకు అని అర్థం చేసుకోవాలి.

3. ఆత్మానుభవత్తుక్కు స్వర్గానుభవం విరోధి – స్వర్గపు సుఖానుభవం తమ ఆత్మ సుఖానికి  అడ్డంకి.

స్వర్గ సుఖాలు – ఆత్మానుభవానికి అడ్డంకి

కైవల్యం అనే మోక్షరకంలో ఆత్మానుభవము ఒకటి. కైవల్యం మోక్షం అనగా, ఆత్మ ఈ జన్మ మరణ చక్రం నుండి విడులైయ్యి విరజా నదిని దాటి శ్రీవైకుంఠం చేరుకొని పూర్తిగా తనను తాను (జీవాత్మ) ఆనందించడం అన్నమాట. ఈ సంసారంలో మరలా పుట్టుక ఉండనందున ఇది కూడా ఒక రకమైన మోక్షంగా పరిగణిస్తారు. మన పుణ్య ఫలం ఉన్నంతవరకే స్వర్గసుఖాలు అనుభవించగలుగుతాము. ఆ పుణ్య ఫలాన్ని అనుభవించిన తరువాత, ఈ భూమిపైన మరలా జన్మనెత్తి తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాలి అని “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” లో వివ రించారు.

4. ఆత్మానుభావ కామనుక్కు స్వర్గం విరోధి – ఆత్మానుభావం ఆశించే వారికి  స్వర్గ సుఖాలను అనుభవించాలనే కోరిక అడ్డంకి.

(దయచేసి మునుపటి సూత్ర వివరణను చూడండి.)

5. భగవత్ అనుభవత్తుక్కు ఆత్మానుభవం విరోధి – తమ ఆత్మానుభవం భగవత్ అనుభవానికి విరోధి.తమ అనుభవం – భగవత్ అనుభవానికి విరోధి

భగవత్ అనుభవం అనగా భగవానుడి ఉభయ విభూతి ఐశ్వర్యాన్ని (నిత్య విభూతి, లీలా విభూతి) కళ్యాణ గుణాలతో కూడిన వారి దివ్య మంగళ స్వరూపాన్ని ఆస్వాదించడం అన్నమాట. ఈ అనుభూతి భగవత్ ప్రీతిని కలిగింపజేస్తుంది. ఆ భగవత్ అనుభూతి నుంచి భగవత్ కైంకర్యం చేయాలనే కోరిక పుడుతుంది. శ్రీవైకుంఠంలో ఈ పరమానందాన్ని నిత్య పరమానంద మోక్షం అని అంటారు. అత్మానుభవం ఆ శ్రీవైకుంఠానికి దారితీస్తున్నప్పటికిని భగవత్ అనుభవంతో పోల్చితే,  అది చాలా అల్పమైనది. కావున, తనను తాను ఆస్వాదించే (ఆత్మానుభవం) కోరిక  భగవత్ అనుభవానికి ఒక ఆటంకము.

అనువాదకుని గమనిక: జీవాత్మ స్వతహాగానే జ్ఞానమయుడు, ఆనందమయుడు. కావున, అతడికి అత్మానుభవ ఆసక్తి  కలుగవచ్చు. కానీ అది చాలా  అల్పమైనది. ఎందుకంటే ఆత్మ అణు స్వరూపమైనది. ఈ ఆత్మ యొక్క జ్ఞానానందాలు కూడా చిన్నవే. కానీ భగవానుడు విభుడు (సర్వవ్యాపి,  సర్వశక్తిమంతుడు). భగవదనుభవంతో పోల్చితే జీవాత్మ అనుభవం అల్పమైనది స్వల్పమైనది.

6. భగవత్ అనుభవ కామనుక్కు ఆత్మానుభవ ఇచ్చై విరోధి – భగవత్ అనుభవాన్ని ఆశించేవారికి, తమను తాము ఆనందించడం ఆటంకము.

(దయచేసి మునుపటి సూత్ర వివరణను చూడండి.)

7. గుణనిష్ఠనుక్కు గుణి విరోధి – భగవత్గుణ నిష్ఠ ఉన్నవారికి, భగవత్ స్వరూపం విరోధి.

భగవత్ స్వరూపాన్ని ఆస్వాదించి అనుభవించుట – భగవత్ గుణానుభవం గుణనిష్ఠకి అడ్డంకి – “సదా పరగుణావిష్ఠః” అని చెప్పినట్లు, “భగవత్ మంగళ గుణాలను సదా అనుభవించువాడు అని అర్థం. “సోస్నుతే” అని శృతి ప్రమాణంలో చెప్పినట్లు, జీవాత్మ పరమాత్ముని మంగళ గుణాలతో కూడి ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు అని తెలియజేస్తుంది. “రసోవై సః” అంటే మాధుర్యంతో రూపుదిద్దుకున్నవాడు అని అర్థం. శ్రీవైకుంఠంలో ముక్తాత్మ ఆ అనుభవాన్ని పొందుతాడు. ఎమ్బెరుమాన్ (భగవాన్) తమ దివ్య లీలల ద్వారా తన దివ్యమంగళ గుణాలను దర్శింపజేస్తారు. తిరువిరుత్తం 98వ పాసురంలో “నెంజాళ్ నినైప్పరిత్తాళ్ – వెణ్ణెయుణెన్నుం ఇరచ్ చొళ్ళే” అని, తిరువాయ్మొళి 1.3.1 వ పాసురం “ఎత్తిఱాం! ఉరలినోడు ఇణైన్తిరుంతేంగియ ఎళివే” అని, నమ్మాళ్వార్ల పాశురాల ద్వారా భగవద్ గుణానుభవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది పెరియ తిరువందాది 86వ పాశురంలో “చీర్ కలంత చొల్” గా  (భగవత్గుక్షణాలలో మునిగిన శబ్దాలు అని అర్థం) వివరించారు. గుణి అనగా దివ్యమైన భగవత్ స్వరూపం (అనగా, గుణం ఉన్నవాడు గుణి అని అర్థం). గొప్ప యోగులు కూడా అతి కష్టమైన ఈ భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోయారు. భగవత్ స్వరూపంపైన దృష్టి ఉంచడం భగవత్ గుణ అనుభవానికి ఒక అడ్డంకి అవుతుంది.

8. కైంకర్యనిష్ఠనుక్కు భగవత్ సౌందర్యం విరోధి –  భగవత్సేవను అనుభవించే వాడికి భగవత్ సౌందర్యం అడ్డంకి.

భగవత్ సౌందర్య నిష్ఠ –  కైంకర్యలో అడ్డంకి (నిత్యం రాముడి సేవలో మునిగి ఉండేవాడు లక్ష్మణుడు)

కైంకర్యనిష్ఠులు –  “అహం సర్వం కరిష్యామి” (మీకోసం ఏదైనా చేస్తాను) అని ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) అన్నట్లు,  సదా తమ దృష్టి భగవానునిపైనే ఉంచారు. మన దృష్ఠి ఒకసారి అతని దివ్య సౌందర్యంపైన పడి అతనిని అనుభవించటం మొదలుపెడితే, మన మనస్సు దృష్టి అతనిపైన స్థిరపడి ఆశ్చర్యచకితులమౌతాము. మనలో ఈ భావన వచ్చినపుడు అది పెరుమాళ్ళ కైంకర్య నిష్ఠలో బాధ కలిగిస్తుంది. అందువల్ల పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుపడి సూత్రం 187 లో ” సౌందర్యం అంతరాయం” అంటే భగవత్ సౌందర్యం అడ్డంకి అని అర్థం. సహజంగా – భగవనుడు యజమాని, జీవాత్మ అతనికి దాసుడని అంటారు. భగవత్ గుణాలను అనుభవించడం ద్వారా, భగవంతుడికి జీవాత్మకు మధ్య అనుబంధం పెరిగి, అతనిలో క్రమేణ  ఆ మంగళ గుణాలున్న భగవానుడికి సేవ చేయాలనే కోరిక పుడుతుంది. శేషత్వ స్వరూపుడైన జీవాత్మకి ఈ భావన సరితూగుతుంది, ఇది కోరదగినదే. ఇది ఎంతో అవసరం. కాని ఒకసారి భగవత్ సౌందర్యముపై దృష్టి మరలితే, ఆ అనుభవం కైంకర్యం జరగకుండా అడ్డుకుంటుంది. అందువల్ల, కైంకర్య నిష్ఠులకు భగవత్ సౌందర్యం అడ్డంకి అని చెప్పవచ్చు.

9. భాగవత కైంకర్య నిష్ఠనుక్కు భగవత్ కైంకర్యం విరోధి – భాగవత (భక్తులు) కైంకర్యంలో రుచి ఉన్నవారికి  భగవత్ కైంకర్యం ఒక అడ్డంకి.

భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యంలో అడ్డంకి

జీవాత్మ స్వరూపం భగవత్ దాస్యం. భగవానుడికి పూర్ణ దాసుడిగా ఉండాలి. ఇంకా ముఖ్యమైనది – స్వరూప యాథాత్మ్యం, భాగవత శేషత్వం. పెరియ తిరుమొళి 8.10.3 లో, తిరుమంగై ఆళ్వార్లు తిరుమంత్ర సారాన్ని ఎమ్బెరుమానికి తెలియజేస్తూ ఇలా అన్నారు, ” నిన్ తిరువెట్టెళుత్తుం కఱ్ఱు నాన్ ఉఱ్ఱతుం ఉన్నడియార్కడిమై కణ్ణపురత్తుఱైయమ్మానే ” –  తిరుకణ్ణపుర భగవానుడా! తిరుమంత్ర సారాన్ని తెలుసుకున్న తరువాత నేను నీ భక్తులకు దాసుడని అర్థం చేసుకున్నాను. తిరుమళిశై ఆళ్వార్ నాన్ముగన్ తిరువందాది 18 వ పాశురంలో “ఏత్తియిరుప్పారై వెల్లుమే మాఱ్ఱవరైచ్ చాత్తియిరుప్పార్ తవం” – భగవత్భక్తి కన్నా ఉన్నతమైనది భక్తుల పట్ల ప్రేమ). ఏత్తియిరుప్పార్ – భగవత్  శేష భూతర్ – భగవానునికి శరణాగతి చేసినవాడు. అటువంటి భక్తులకు శరణాగతులై ఉన్నవారి స్థితి ఉన్నతమైనది. శ్రీరామాయణంలో, శ్రీరాముడికి లక్ష్మణ భరతులు పూర్ణ శరణాగతులై ఉండేవారు. భరతుడే సర్వస్వంగా శత్రుఘ్నుడు ఉండేవారు. శ్రీరామాయణంలో  “శత్రుఘ్నొ నిత్యశతృఘ్నః” (అడ్డంకులన్నింటినీ జయించినవాడు) అని చెప్పబడింది.  మన పూర్వాచార్యులు ఇలా వివరించారు “శ్రీరాముడి సౌందర్య గుణాలపై ధ్యానించకుండా భరతుడి సేవలో మునిగి ఉండేవారు. తిరువాయ్మొళి 8.10.3 పాశురంలో నమ్మాళ్వార్లు “అవనడియార్ శిఱుమామనిశరాయ్ ఎన్నైయాణ్డార్”. భగవానుడికి శరణాగతి చేసినవాడిని ‘శిఱుమామనిశర్’ అని అంటారు. చిన్న వాడైనా జ్ఞానాచరణలో గొప్పవాడు అని అర్థం. అటువంటి వాడే నాకు స్వామి అని నమ్మాళ్వార్లు చెబుతున్నారు. అటువంటి భక్తులు ఎదుట ఉన్నప్పుడు, వారిని విస్మరించి పెరుమాళ్ళ పాద పద్మాలను ఎలా సేవించగలం? భాగవత కైంకర్యమే జీవాత్మ స్వరూపానికి అతి ఉత్తమమైనది. అందువల్ల భాగవత కైంకర్యానికి భగవత్ కైంకర్యం అడ్డంకి అని చెప్పవచ్చు.

తరువాత భాగాన్ని మనం వచ్చే సంచికలో అనుభవిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో :  https://granthams.koyil.org/2013/12/virodhi-pariharangal-1/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment