శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం
శ్రీ రంగనాథుడు, అయిన పెరియ పెరుమాళ్, శ్రీరంగం లో శయనించిన స్వామి, అనంతమైన ఆనందం కలిగిన శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడిగా ఉన్న వాడు, నిత్యసూరులు(శాశ్వతంగా ముక్తులు అయిన ఆత్మలు) మరియు ముక్తాత్మల(మోక్షము కలిగిన ఆత్మలు) చేత సేవించ బడుతున్న వాడు. తాను అక్కడ నిత్యము ఆనందములో రమిస్తున్నపటికీ, వారి దివ్య హృదయం లో సంసారంలోని బద్ధ జీవాత్మలుగా ఈ లోకంలో జీవిస్తున్న మన గురించి ఆలోచన చేత దుఃఖం కలుగుతుంది. వారి దివ్య మనస్సులో, ఈ జీవాత్మలకు సహాయం చెయ్యాలి అని, వారిని ఉద్ధరించాలి, వారికి గొప్ప ఆనందం కలిగించాలి అని సంకల్పం కలిగింది. ఈ సంసారంలో, ప్రళయం పూర్తి అయినా తర్వాత, సమస్త పదార్థములు లయం అయ్యాయి మరియు సూక్ష్మముగా మారిపోయాయి. ఆ సమయంలో, తను అసంఖ్యాకమైన అండములు సృజించాడు, ప్రతి అండానికీ జీవులనుండి ఉత్తములను బ్రహ్మగా నియమించారు. ఈ అండములలో బ్రహ్మ, ప్రజాపతులు ద్వారా దేవతలు, మనుష్యులు, జంతువులు, పక్షులు మరియు స్థావరాలను సృజించారు. ఇవన్నీ సృజించిన తర్వాత, ప్రతి అండములో తానే స్వయముగా క్షీరాబ్ధి (పాల సముద్రము)లో క్షీరాబ్దినాథుడు గా ఉంటూ అందరిని రక్షిస్తున్నారు. బ్రహ్మ మొదలైన దేవతలకు కష్టాలు ఏర్పడిన సమయం లో, వారు క్షీరాబ్ది ద్వారం వద్దకు చేరి, ఆ భగవానుడిని సహాయం చెయ్యమని అర్థిస్తారు.
ఈ విధముగా, రావణుడు అను రాక్షసుడి చేత ఈ లోకంలో ఒకసారి అనేక మంది పీడించబడారు. కావున, బ్రహ్మా మొదలయిన దేవతలు అందరూ ప్రచండమైన సముద్రములో చిక్కుకున్న ఓడలాగ కలవరపడి, క్షీరాబ్దిలోని భగవానుడికి శరణాగతి చేసి వారి మొరలు వినిపించారు.
భగవానుడు కూడా రావణుడు మొదలైన రాక్షసులతో నిండిన లంకను నశింప చెయ్యాలి అని అనుకుని. తన సంకల్పం చేత లంకను నశింపచేసి జనులను ఉద్ధరించాలి అని తలిచారు, భగవానుడు శ్రీ కౌసల్య మరియు దశరథ చక్రవర్తి తనయుడు శ్రీ రాముడి గా అవతరించారు. మన సంప్రదాయంలో, శ్రీ రాముడు పెరుమాళ్ గా తెలపబడ్డారు. అదే సమయంలో, భగవానుడితో పాటుగా, భరత, లక్ష్మణ మరియు శత్రుజ్ఞుడు కూడా అవతరించారు.
కులగురువు అయిన వశిష్ఠుడు, నలుగురు కుమారులకు తగిన పేర్లు ఇచ్చారు. అందమైన రూపం తో అందరి మనస్సులు ఆకట్టుకునే కారణం చేత – శ్రీ రామ, కైంకర్యం అనే సంపద పూర్తి గా కలిగి ఉండటం చేత – లక్ష్మణ, (వశిష్ఠుడికి) ముందుగానే రాజ్య భారం తను భరిస్తాడు అని తెలుసు గనక – భరత, భగవద్ భక్తి అను శత్రువుని జయించి, భాగవతుడు అయినా భరతుడికి భక్తుడు అయినందుకు, శత్రుజ్ఞుడు.
శ్రీ రాముడు, అసంఖ్యాక కల్యాణ గుణాలతో ప్రకాశిస్తున్నారు. ఆ నలుగురికి ఉపనయన సంస్కారం అయ్యింది, గురుకుల వాసం చేశారు మరియు అస్త్ర విద్యా ప్రవీణులు అయ్యారు. ఒక్కసారి విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ చక్రవర్తిని కలిశారు. చక్రవర్తి వారిని సాదరంగా సత్కరించారు. వేద పారంగతుడు అయిన మహర్షి తాను యజ్ఞం తలపెట్టాడు అని, కొందరు రాక్షసులు ఆ యజ్ఞానికి భంగం చేసే ఆలోచనలు కలిగి ఉన్నారు అని మరియు రామ లక్ష్మణులను యజ్ఞ సంరక్షణకై పంపించాలి అని కోరారు ఇది విన్న దశరథుడు మొదటగా మూర్ఛిల్లి కాసేపటికి తేరుకొని తన కుమారులు చిన్నవారని, వారి వియోగంలో జీవించలేను అని, ఈ కారణం చేత తాను పంపించలేను అని ప్రాధేయపడ్డారు. కానీ విశ్వామిత్రుల వారు శ్రీరాముని వైభవం చెప్పి, వశిష్ఠుడి సహాయంతో చక్రవర్తిని అందుకు ఒప్పించారు.
శ్రీరామ లక్ష్మణులు మహర్షిని అనుసరించారు. అరణ్యం లోనికి ప్రవేశించిన తర్వాత, తాటకా అనే క్రూర రాక్షసి వారి ఎదుట నిలిచింది. మహర్షి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు బాణంతో కొట్టి సంహరించారు. అటుపిమ్మట, ఆ రాక్షసి కుమారులు అయిన మారీచ మరియు సుభాహువులు యుద్ధానికి వచ్చారు. వారిలో సుభాహువుని శ్రీరాముడు సంహరించారు. మారీచుని శ్రీరాముడు బాణం తో కొట్టి చాలా దూరం పడివేశారు. ఇలా ఎందరో శక్తివంతులు అయిన రాక్షసులను సంహరించారు. వారి రక్షణలో విశ్వామిత్రుడు యాగాన్ని పూర్తి చేశారు.
అటుపిమ్మట, మహర్షి వారిని మిథిలా దేశం వైపు తీసుకుని వచ్చారు. మార్గంలో గౌతమ మహర్షి ఆశ్రమం వద్ద, గౌతముడి శాపం వల్ల రాయిగా మారిన మహాపతివ్రత అయిన గౌతముని భార్య అహల్యా ఉంది. శ్రీరాముని తిరువడి(పాదాలు) స్పర్శ తగిలిన వెంటనే రాయిగా ఉన్న అహల్య శాప విమోచనం కలిగింది. తర్వాత, మహర్షి, శ్రీరాముడు, మరియు లక్ష్మణుడు మిథిలా చేరుకున్నారు. అక్కడ మిథిలా రాజ్యం మహారాజు అయిన జనకుడు, తన కుమార్తై అయిన సీతా స్వయంవరం లో భాగంగా శివ ధనుస్సుని ఎక్కుపెట్టిన వారికి తన కుమార్తెను ఇస్తాను అని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన చాలా మంది రాకుమారులు ప్రయత్నించారు కానీ వారు విల్లును కూడా ఎత్తలేకపోయారు. విశ్వామిత్రుడు, శ్రీరాముడిని మరియు లక్ష్మణుడిని ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ జనక మహారాజుకి శ్రీరాముడిని మరియు లక్ష్మణుడిని పరిచయం చేసి, శ్రీరాముడిని ధనుస్సుని ఎక్కిపెట్టమని ఆదేశించాడు. శ్రీరాముడు అనాయాసంగా ధనుస్సుని ఎత్తి ఎక్కుపెట్టారు. జనక మహరాజు మరియు సీతాపిరాట్టి ఎంతో సంతోషించారు. తక్షణమే కళ్యాణ ముహూర్తం నిర్ణయించారు; అయోధ్య నుండి అందరు మిథిలా చేరుకున్నారు; శ్రీరాముడు సీతమ్మవారిని, భరతుడు మాండవిని, లక్ష్మణుడు ఊర్మిళను మరియు శత్రుజ్ఞుడు శ్రుతకీర్తిని కళ్యాణం చేసుకున్నారు.
ఆ సమయం లో, పరశురాముడు అక్కడికి చేరుకున్నారు. తను కూడా భగవానుడి ఆవేశ అవతారం. తన పరుశు (గొడ్డలి) తో దుష్టులు అయిన రాజులు ఇరువైఒక్క తరాలను సంహరించారు. శ్రీరాముడు ఎక్కిపెట్టిన శివ ధనస్సు వెనక ఒక్క కథ ఉంది. పూర్వకాలంలో, విశ్వకర్మ రెండు ధనుస్సులను సృష్టించారు. విష్ణు మరియు శివుని మధ్య గొప్ప దైవం ఎవరు అని యుద్ధం నిర్ణయించారు. విష్ణువు తీసుకున్నది విష్ణు ధనుస్సు అలాగే శివుడు తీసుకున్నది శివ ధనుస్సు. విష్ణువు హూంకరించిన మాత్రం చేత శివ ధనుస్సు కొంచం విరిగింది. ఈ సంఘటన చూసిన అందరు ఈ చర్య వల్ల విష్ణువు యుద్ధం గెలిచారు అని విష్ణువే గొప్ప దైవం అని ఒప్పుకున్నారు, ఆ విష్ణు ధనుస్సు పరుశురాముడికి మరియు శివ ధనుస్సు జనక మహారాజుకి చేరింది. ఇది ఇలా ఉండగా, శ్రీ రాముడి పట్ల పరుశురాముడికి విపరీతమైన కోపం కలిగి శ్రీరాముడిని సంహరిస్తాను అని చెప్పారు. ఇది తెలుసుకున్న దశరథుడు, తన పుత్రుడిని వదిలేయమని పరుశురాముడిని ప్రార్థించారు. అయినా సరే పరశురాముడి కోపం తగ్గలేదు. శ్రీరాముడు తన మంచితనాన్ని ఎలా నిరూపించుకోవటం అని అడుగగా, పరుశురాముడు చెప్తూ “నీవు విరిగిన శివ ధనస్సుని ఎక్కుపెట్టావు. ఒకవేళ నువ్వు నా విష్ణు ధనస్సుని ఎక్కిపెడితే నేను ఒప్పుకుంటాను” అని అన్నారు. ఆ సమయం లో, శ్రీ రాముడు, పరశురాముడి విష్ణు ధనస్సుని వారి తపోశక్తితో పాటుగా తీసుకుని, ఈ ధనస్సుని కూడా ఎక్కిపెట్టారు, పరశురాముడి శక్తి హరించి తిరిగి వారిని తపస్సు చేసుకోవటానికి పంపించేశారు.
ఆ తర్వాత, అందరు సంతోషం గా శ్రీ అయోధ్యకు తిరిగి చేరారు.
సారం
- భగవానుడు తన నిర్హేతుక కృప చేత, ఈ లోకాన్ని సృజించారు. తాను ఈ ఆత్మలను ఉద్ధరించటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
- శ్రీ రామావతారం సన్నివేశాలలో, శ్రీ రాముడు పెద్దల మాటని అనుసరించటం వంటి సామాన్య ధర్మాన్ని ప్రదర్శించారు. లక్ష్మణుడు, భగవానుడికి మాత్రమే దాస్యము చెయ్యటం అనే శేషత్వాన్ని కనపరిచారు. భరతాళ్వాన్, భగవానుడి ఆజ్ఞను పూర్తిగా పాటించటం అనే పారతంత్రాన్ని ప్రదర్శించారు. శత్రుజ్ఞుడు, భగవంతుడి భక్తుడు అయిన భారతాళ్వాన్ పట్ల దాస్యం ద్వారా భాగవత శేషత్వం కనపరిచారు. సీతా పిరాట్టి, పరమపురుషుడు అయిన భగవానుడి కోసం మాత్రమే మనం జీవించాలి అని తెలిపారు. హనుమాన్, స్వామి భక్తి ని సూచించారు. విభీషణాళ్వాన్ అసలు మనం శరణాగతి ఎలా చెయ్యాలో చూపారు. ఇలా అనేక విశేష అంశాలు, ఈ శ్రీ రామాయణంలో ఉన్నాయి.
- పరమ కారుణికుడు అయినా భగవానుడు స్త్రీ అయిన తాటకాను సంహరించటం వెనుక కారణం, తాను మనస్సుని మాత్రమే చూస్తాడు శారీరిక రూపాన్ని కాదు అని మనకు బోధించటానికి.
- అహల్య శాప విమోచనం, భగవానుడి తిరువడి అన్ని రకాల దుఃఖాలు తొలిగిస్తాయి అని చూపటానికి నిదర్శనం.
- భగవానుడి అవతారాల లో ప్రధానం గా రెండు రకాలు, ముఖ్యావతారాలు (ప్రాథమిక అవతారాలు) మరియు అవేశావతారాలు (ఇతరావతారాలు). ముఖ్యావతారం లో, పరంపదంలో వారికి ఉన్నటువంటి పూర్తి గుణాలతో పూర్ణంగా అవతరిస్తారు. ఆవేశావతారం లో, తమ శక్తి లేదా స్వరూపాన్ని(తమ నిజ స్వభావం) జీవాత్మల్లో ప్రవేశ పెడతారు. మోక్షం కోరుకునే వారికి ఆవేశావతారాలు ఆరాధనా యోగ్యంకాదు.
- శ్రీ రాముడు మరియు పరుశురాముడి కలయిక లో, మనం తెలుసుకోవాల్సింది ముఖ్యావతారం ఎదుట ఆవేశావతారం నిలబడదు అని.
- శ్రీమన్నారాయణుడు మరియు శ్రీమహాలక్ష్మి ఎప్పడు కలిసి ఉంటారు. కానీ లీలలో భాగంగా, ఈ లోకంలో అవతరిస్తారు, కొంత సమయం వేరుగా ఉండి, దివ్య కళ్యాణం ద్వారా తిరిగి కలుస్తారు. అయినప్పటికీ ఎప్పడు తన వక్షస్థలం పైన ఉన్నారు.
మూలం — https://granthams.koyil.org/2024/11/04/srirama-leela-bala-kandam-english/
అడియేన్ ఆకాశ్ రామానుజ దాసన్
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org