శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
ఉపదేశం 16
విష్ణోర్ గురోర్ వైష్ణవస్య గృహాణాం చ దిశం ప్రతి | పాదౌ ప్రసార్య నిద్రాం చ కధాచిన్నైవ కారయేత్ ||
సరళమైన వివరణ: భగవానుని ఆలయం, ఆచార్యుల నివాసం లేదా శ్రీవైష్ణవుల నివాసం వైపు పాదాలు చాచడం, నిద్రించడం లేదా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయకూడదు.భగవానుడు, ఆచార్యుడు లేదా శ్రీవైష్ణవులు ఉన్నచోట గానీ, అలా చేయకూడదు.ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే, భగవానునికి, భాగవతులకు మరియు ఆచార్యులకు అగౌరవం చూపకూడదు.మన వైదిక సంప్రదాయంలో, ఎవరి వైపైనా పాదాలు చాచడాన్ని సాధారణంగా అవమానంగా భావిస్తారు.కాబట్టి, అలా చేయకూడదు. ఒకవేళ ఎవరైనా నివసిస్తున్న ఇంటికి ఒకవైపు భగవానుని ఆలయం, మరోవైపు ఆచార్యుల మఠం, ఇంకోవైపు శ్రీవైష్ణవుల నివాసాలు మొదలైనవి చుట్టుముట్టి ఉంటే, అప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారుతుంది.పాదాలు ఈ రెండింటి మధ్య దిశలో ఉండేలా పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.ఉదాహరణకు, తూర్పు దిశలో భగవానుని ఆలయం, ఉత్తర దిశలో ఆచార్యుల మఠం ఉన్నట్లయితే, అటువంటి సందర్భాలలో మనం మన పాదాలను మధ్యలో, అంటే ఈశాన్య దిశ వైపు చాచవచ్చు.కాబట్టి, మనం ఆచరణాత్మకంగా ఆలోచించి, భగవానుడు, భాగవతులు, ఆచార్యులు మరియు వారి నివాసాల వైపు మన పాదాలను చాచకుండా ఉండటానికి ప్రయత్నించాలి. సాధారణంగా, మనం మన పాదాలను వారి దిశలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అలా చేయడానికి మనకు ఏ మార్గమూ లేకపోతే, అప్పుడు మనం క్షమించమని కోరి, భగవానుడు, భాగవతులు మరియు ఆచార్యుల దిశ వైపు మన పాదాలను చాచే అవకాశం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
వీడియో లింక్: https://youtube.com/shorts/m0AYa3EDwhA?si=EnuiEqX1wwNzbXOb
ఉపదేశం 17
కృత నిద్ర: సముత్థాయా వదేత్ గురుపరంపరామ్ ||
సరళమైన వివరణ: నిద్రలేచిన వెంటనే, గురుపరంపరను ధ్యానం చేసి , పఠించాలి.సాధారణంగా మనం నిద్ర లేవగానే “హరి హరి హరి” అని పఠించాలని శాస్త్రము చెబుతుంది. భగవానుని ఆశ్రయించిన ప్రతి ఆత్మకు అది సాధారణ ఆదేశం, సాధారణ క్రమం.ప్రత్యేకించి, మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో, మనం ఎల్లప్పుడూ గురుపరంపర (ఆచార్య పరంపర) ద్వారా భగవాన్ను చేరుకుంటాము.మనం ఎప్పుడూ భగవంతుని దగ్గరకు నేరుగా వెళ్ళము. మనం ఆచార్యుల వద్దకు వెళ్లకుండా నేరుగా భగవాన్ వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తే, ఇతర దేవతలను పూజించినంత మంచిదని చెప్పబడింది, ఎందుకంటే భగవంతుడు ఎల్లప్పుడూ ఆచార్యులు మరియు భాగవతుల ద్వారా తనను సంప్రదించాలని ఇష్టపడతాడు.కాబట్టి శ్రీవైష్ణవులు ఎల్లప్పుడూ మొదట గురుపరంపర గురించి ఆలోచించడం మరియు ఆ తర్వాత భగవానుని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం.ఇక్కడ గురు పరంపర అంటే గురు పరంపర మంత్రం లేదా వాక్య గురు పరంపర.అంటే, “అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశ దాసాయ నమః,శ్రీమత్ యామునామునయే నమః,శ్రీ రామ మిశ్రాయ నమః,శ్రీ పుణ్డరీకాక్షాయ నమః,శ్రీమన్నాథమునయే నమః,శ్రీమతే శఠగోపాయ నమః,శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రీయై నమః, శ్రీధరాయ నమః”.ఇది గురు పరంపర మంత్రం.మనం మొదట నిద్రలేవగానే ఈ మంత్రాన్ని ధ్యానించాలి.ఆ తర్వాత మనం ‘హరి’ అని పఠించవచ్చు.అదేవిధంగా, ద్వయ మహామంత్ర అనుసంధానం చేస్తున్నప్పుడు కూడా, మనం మొదట గురుపరంపరను పఠించి, ఆ తర్వాత మాత్రమే ద్వయ మహా మంత్రాన్ని పఠించాలి.పిళ్లై లోకాచార్యులు “జప్తవ్యం గురుపరంపరైయుం ద్వయముమ్” అన్నారు. కాబట్టి, మనం ఎల్లప్పుడూ గురుపరంపర పఠిస్తాము, గురుపరంపరను ధ్యానిస్తాము మరియు ఆ తర్వాత మాత్రమే భగవాన్ మరియు ఆయనకు సంబంధించిన మంత్రాలు పఠిస్తాము.
వీడియో లింక్: https://youtu.be/lKSuWUOGknM?si=rCzcju3aihV-5dGP
ఉపదేశం 18
మహాభాగవతాన్ దృష్ట్వా నిషన్నాన్ విష్ణు సన్నిదౌ | కుర్వన్ ద్వయానుసంధానం ప్రణమేత్ దణ్డవత్ భువి ||
సరళమైన వివరణ: మనం భగవానుని సన్నిధిలో – అంటే ఆలయంలో గానీ లేదా ఏదైనా మండపంలో గానీ భగవానుని సమక్షంలో – ‘భాగవతోత్తములను’ దర్శించినప్పుడు, మనం ‘ద్వయ మహా మంత్రాన్ని’ ధ్యానిస్తూ, ఒక కర్ర నేల మీద పడినట్లుగా సాష్టాంగపడి వారికి ప్రణామం సమర్పించాలి.దీనినే ‘దణ్డవత్ ప్రణామం’ అని పిలుస్తారు. ఇది అత్యంత ముఖ్యమైన ఆదేశం.అయితే నేటి కాలంలో కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయి; ఎందుకంటే చాలా చోట్ల, మనం ఆలయాల్లో మన ఆచార్యులను లేదా ఉత్తమ భాగవతులను చూసి వారికి ప్రణామం చేయబోతే, అక్కడి ప్రజలు మనల్ని అడ్డుకుంటూ, ఆలయంలో కేవలం భగవానుని మాత్రమే ఆరాధించాలి అని చెబుతుంటారు.కానీ వాస్తవానికి, ఆలయాల్లో భాగవతోత్తములు కనిపించినప్పుడు కూడా, మనం వారికి ప్రణామం చేయాలని – అదీ సాష్టాంగ దణ్డవత్ ప్రణామం చేయాలని – భగవద్ రామానుజులే స్వయంగా స్పష్టంగా పేర్కొన్నారు.అయితే, దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా ప్రణామం చేసే ఆచారం మొదలవుతుందేమోనన్న సామాజిక ఆందోళనలు లేదా ఆంక్షలు ఏవైనా ఉంటే, మనం కొంత సంయమనం పాటించాల్సి రావచ్చు.కానీ నిస్సందేహంగా, అవకాశం ఉన్నప్పుడు మరియు సాధ్యమైనప్పుడు – ఆలయాల లోపల ఉన్నప్పటికీ – మనం ఉత్తమ భాగవతులకు తప్పక ప్రణామం సమర్పించాలి.భారత దేశపు దక్షిణ ప్రాంతంలో ఉన్న కొన్ని ‘దివ్య దేశాలలో ‘, ఆచార్యులు లేదా ఉత్తమ భాగవతులు ఆలయంలో కనిపించినప్పుడు, ఇతర భాగవతులు వారికి ప్రణామం చేయడం అనేది ఒక సాధారణ ఆచారంగా కనిపిస్తుంది; కానీ ఇతర ప్రాంతాల్లో ఇది అంత సాధారణం కాదు. కాబట్టి, మనం ఆయా పరిస్థితులను గమనించి, తదనుగుణంగా వ్యవహరించాలి. అయితే, ఆలయం లోపల ఉత్తమ భాగవతులకు ప్రణామం చేయడంలో ఎటువంటి తప్పు లేదు.
వీడియో లింక్: https://youtube.com/shorts/BhqGlvL8Yos
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/04/20/bhagavath-ramanujas-final-instructions-16-18-english/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org